పార్లమెంట్కు చెందిన హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(Standing committee) VPN నిషేధించాలని సిఫార్సు చేసింది.
దీంతో (VPN) దేశంలో బ్యాన్ అవుతుందా? అనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అసలు వీపీఎన్ అంటే ఏమిటి తెలసుకుందాం..
VPN అంటే ఏంటి ?
VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ .
ఆన్లైన్లో మనల్ని ఎవరూ ట్రాక్ చేయకుండా మనకు కావాల్సిన వెబ్ సైట్లు(Websites), స్ట్రీమింగ్ వెబ్సైట్లను చూసే వీలుంటుంది. ఫ్రీగా VPN అందించే సంస్థల్లో ఏవీ బెస్ట్ ఫీచర్లను అందించలేవు. అయితే పబ్లిక్ వైఫై (wi-fi) లాంటివి ఉపయోగించినప్పుడు వీటిని ఉపయోగించడం వల్ల మీ వివరాలు ఇతరులకు తెలియకుండా కాపాడుకునే వీలుంటుంది. ఫ్రీ VPN అందించే సంస్థలు కొన్ని సర్వీసులను ప్రీమియంగా నిర్వచించి వాటికి డబ్బు కట్టేలా చేస్తాయి. మరికొన్ని మీ బ్రౌజర్లలో వచ్చే యాడ్స్ ద్వారా ఇంకొన్ని సంస్థలు మీ వివరాలను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. అందుకే వీలైనంత వరకూ మరీ అవసరం అయితే తప్ప ఫ్రీ VPN కి దూరంగా ఉండాలి.
VPN ఏలా పనిచేస్తాయి..
Vpn నెట్వర్క్ వినియోగించే వారికి ఎలాంటి భయం ఉండదు. ఎవరూ ట్రాక్ చేసే వీలే లేదు.ఏ నెట్వర్క్, సైట్ వీటిని గుర్తించలేవు. ఇది ఫోన్ను ప్రైవేట్ సర్వర్లకు కనెక్ట్ చేస్తుంది. తద్వారా యూజర్ల ఐపీ అడ్రెస్ ఇతర నెట్వర్క్లకు కనిపించదు.
ఫ్రీ VPN సర్వీసులు మీ డేటాను ఎన్ క్రిప్ట్ చేస్తాయి. మీరు చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని సులువుగా చేరేలా చేస్తాయి. కేవలం సెక్యూర్ వెబ్ సెషన్ ని, డేటా ఎన్ క్రిప్షన్ ని అందించడమే కాదు.. సెండర్, రెసిపియంట్ వివరాలను కూడా రహస్యంగా ఉంచుతాయి. ఇవన్నీ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సెక్యూరిటీని ఉపయోగించుకుంటాయి.
అయితే VPN మీ డేటాను సెక్యూర్ చేయడంలో భాగంగా మీ డేటా స్పీడ్(Data Speed) ఒక్కోసారి చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రీ VPN ని ఉపయోగించేటప్పుడు ఇది ఇంకా ఎక్కువ. బెస్ట్ ఫ్రీ VPN అయితే పెద్ద పెద్ద డేటా పైప్స్ని కలిగి ఉండి ఈ వేగాన్ని తగ్గకుండా కాపాడతాయి.
Vpn ని కేంద్రం ఎందుకు నిషేధించాలని అనుకుంటుంది ?..
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత దేశంలో ముఖ్యంగా ఐటీ పరిశ్రమ వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తోంది. ఇందుకోసం కంపెనీలు VPN లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఇందుకోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ విధించిన రూల్స్ ను కూడా కాస్త సడలించింది.
అయితే ఇప్పుడు అవే VPNలు సైబర్ బెదిరింపులు మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అడ్డుగా ఉండడంతో వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సేవల(vpn)ను మన దేశంలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిషేధించాలని చూస్తున్నట్లు సమాచారం.
సైబర్ సెక్యూరిటీ నుంచి కూడా దీని ద్వారా తప్పించుకోవచ్చని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే దాని వాడకాన్ని నిషేదించాలని కోరుతున్నట్లు కమిటీ సిఫార్సు చేసింది.
దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది. దేశంలో vpn సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్(Tracking), నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖను కమిటీ కోరింది.
